బాలల దినోత్సవ శుభాకాంక్షలు

childrenచాచా నెహ్రూ పుట్టిన రోజైన నవంబర్ 14ను మనదేశంలో  "బాలల దినోత్సవం"గా జరుపుకుంటున్నాము. చాచా నెహ్రూ మనదేశానికి తొలి ప్రధానమంత్రి. స్వాతంత్ర్యం కోసం తెల్లవారితో పోరాటం చేసేటప్పుడు మహాత్మాగాంధీకి ఈయన ప్రథమ శిష్యుడిగా ఉండేవారు. స్వాతంత్యం సంపాదించిన తరువాత మన దేశానికి మొట్ట మొదటి ప్రధానమంత్రిగా ఈయన పనిజేశారు.

Nehruమన దేశాన్ని దిన దిన ప్రవర్థమానంగా అభివృద్ధి పథంలో నడిపించిన సమర్థత మన చాచాజీ సొంతం. అందుకే నెహ్రూని జాతి అంతా గుర్తించి గౌరవిస్తోంది. అయితే ప్రత్యేకంగా ఆయన పుట్టినరోజునాడే బాలల దినోత్సవం జరుపుకోవడానికి ఒక కారణం ఉంది.

అదేంటంటే... నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం. అయితే ఆయన జీవితంలో ఎక్కువభాగం జైళ్ళలో గడపవలసి రావడంతో ఏకైక కూతురు ఇందిరా ప్రియదర్శినితో ఆయన ఎక్కువ కాలం గడపలేకపోయారు. కానీ దేశంలోని బిడ్డలందర్నీ కన్నబిడ్డలుగా ప్రేమించే స్వభావం నెహ్రూది.

''పిల్లలతో ఉన్నప్పుడు మనసు హాయిగా ఉంటుంది. నాకు ఏ పవిత్రస్థలంలోనూ కూడా అంతటి శాంతి, సంతృప్తి లభించవు'' అని నెహ్రూ అనేవారు. పిల్లలను జాతి సంపదగా భావించి అందరూ వారి భవితవ్యానికి కృషి చేయాలని నెహ్రూ తరచూ చెప్పేవారు. ఆయన పాలనాకాలంలో దేశంలో బాలల అభివృద్ధికి ఎంతో కృషి జరిగింది. అందుకే ఆయన పుట్టిన రోజు నాడు మనదేశంలో బాలలంతా పండగ చేసుకుంటారు. సాంస్కృతికోత్సవాలు నిర్వహించుకొని చాచా నెహ్రూను బాలలు ప్రేమగా స్మరించుకుంటారు.